విజయవాడలో ఓ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు... వాహనదారుల ఫైర్

  • అజిత్ సింగ్ నగర్ లోని ఓ పెట్రోల్ బంకులో ఘటన
  • వర్షపు నీరు పెట్రోల్ ట్యాంకులో కలిసిన వైనం
  • నీళ్లు కలిసిన పెట్రోల్ తో వాహనదారుల ఇక్కట్లు
  • కిలోమీటరు వెళ్లగానే మొరాయించిన వాహనాలు
విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో విస్మయం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుందామని వెళ్లిన వాహనదారులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కొంతదూరం వెళ్లగానే వాహనాలు మొరాయిస్తున్నాయి. 

దాంతో, వాహనదారులు మెకానిక్ లను ఆశ్రయించగా, పెట్రోల్ లో నీళ్లు కలిసిన విషయాన్ని మెకానిక్ లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్ లోని పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు.

దీనిపై, బంకు యాజమాన్యం స్పందించింది. వర్షపు నీరు భూగర్భంలోని పెట్రోల్ ట్యాంకులో కలవడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు మళ్లీ పెట్రోల్ కొట్టిస్తామని, నీళ్లు కలవడం వల్ల పాడైన వాహనాలకు రిపేర్లు కూడా చేయిస్తామని ఆ పెట్రోల్ బంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. దాంతో, వాహనదారులు శాంతించారు.

Petrol
Water
Vijayawada
Rain

More Telugu News